Thursday, August 16, 2018

కవిగా కూడా రాణించిన వాజపేయి !!

గొప్ప తాత్వికునిగా, సౌందర్యోపాసకునిగా, సంస్కృతీ సాంప్రదాయాలను అమితంగా ప్రేమించే వ్యక్తిగా, మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజెప్పే ప్రబోధకునిగా, సామాజిక న్యాయాన్ని, మతసామరస్యాన్ని కోరుకునే మనిషిగా తన కవిత్వంలో వాజపేయి దర్శనమిస్తారు. ఆయన కవితలు శిల్ప సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
‘‘చెదిరిన స్వప్నాల రోదనను వినేదెవరు?/ గుండెలను చీల్చి వెల్లుబికిన వేదన కన్నీటి రూపు దాల్చినా/ నేను ఓటమిని అంగీకరించను/ పోరుబాట పట్టడం నాకిష్టం./ కాల-కపాలంపై రాస్తూనే ఒరిగిపోతాను./ కొత్త గీతాన్ని ఆలపించి నవశకానికి నాంది పలుకుతాను.’’
"బాధలు రానీ, వ్యధలే కమ్మనీ/ నిప్పులు చిమ్మనీ జ్వాలలు రేగనీ/ ఆగదు నా ప్రయాణం, అడుగు ముందుకుపడనీ/ కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా/ మెడవంచను, తలదించను.
"పుష్యపున్నమిలో మంచి ముత్యం లాంటి ఒక మంచు బిందువు ప్రభవిస్తుంది. జగత్‌ను కనువిందు చేస్తుంది. బాలభానుని లేలేత కిరణాలకే తను కనుమరుగవుతానని తెలిసినా అది అంటుంది. "
స్వతంత్ర భారత రాజకీయాలపై తనదైన ముద్రవేసిన రాజకీయవేత్త, భారత మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి బహుముఖ ప్రజ్ఞాశాలి. విలువలతో కూడిన రాజకీయాలకు, దేశప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన వాజపేయి ఒక ఉదాత్తమైన కవి, ఉపన్యాసకుడు, సిద్ధాంతాలనే ప్రాణంగా భావించిన వ్యక్తి. సాధారణంగా రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు. రాజకీయాలు, సాహిత్య సాధన కూడా అటువంటివే. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ‘కవితల మాట అటుంచి వచనంలో రాయడం కూడా కష్టతరం’ అయిందని ఆయన చమత్కరించారు. 1957లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయిన తర్వాత ఉపన్యాసమే తన అభివ్యక్తీకరణకు ప్రధాన సాధనమయిందని తెలిపారు.
వాజపేయి తాతగారు సంస్కృత భాషా పండితులు. తండ్రి కృష్ణ బిహారీ గ్వాలియర్‌, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప కవిగా ప్రసిద్ధులైనారు. ‘జయంతి ప్రతాప్‌’లో ఆయన కవితలు తరచు ముద్రితమై పాఠకులను అలరించేవి. గణేశ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాలలో వారి ప్రసంగాలు అందరినీ అమితంగా ఆకట్టుకొనేవి. ఈ విధంగా వారసత్వంగా సాహిత్య సాధన వాజపేయికి ఒక గొప్పవరంగా లభించింది. నిరాలా, పంత్‌, మహాదేవీవర్మ వంటి ఆ తరం కవులను ఆయన అమితంగా ఆరాధించారు. ఎంతో సున్నిత మనస్కుడైన వాజపేయి అన్యాయాన్ని ఎదిరించేందుకు కవిత్వాన్ని ఒక సాధనంగా చేసుకున్నారు. ఒక రాజకీయవేత్తగా రాణించాలనిగానీ, పెద్ద–పెద్ద పదవులు అధిష్ఠించాలనిగానీ ఆయన ఆ రోజుల్లో ఆకాంక్షించలేదు. భారతీయ జనసంఘ్‌ పట్ల ప్రవృత్తిపరంగా ఆకర్షితులు గావటం, ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రికల్లో కొన్నేళ్ళు పనిచేయటం, కాంగ్రెసేతర నాయకులతో పరిచయాలు ఆయనను రాజకీయాల్లోకి నెట్టాయి.
రాజకీయ జీవితంలో తలమునకలుగా ఉన్నప్పటికీ వాజపేయి తన సాహిత్య సాధనను విడిచిపెట్టలేదు. కవిగా, సంపాదకునిగా వారి పది రచనలు గ్రంథస్థం చేయబడ్డాయి. వాజపేయి కవితలు ‘మేరీ ఇక్యావన్‌ కవితాయేష’ శీర్షికతో ప్రచురణకు నోచుకున్నాయి. మనసున్న కవిగా వాజపేయి తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి, పలు వర్గాల ప్రజల వెతలను అర్థం చేసుకొని శ్రామిక, పీడిత జనశ్రేయస్సే లక్ష్యంగా కవితా సాధన చేయటం గమనార్హం. ‘తాజ్‌మహల్‌’ ఈయన ప్రథమ కవిత. ఈ కవితలో తాజ్‌మహల్‌ సౌందర్యాన్ని వర్ణిస్తూనే, తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల కన్నీటివెతలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రించిన ఈ కవి తన ఆశయం శ్రామిక జన సంక్షేమమే అని చాటిచెప్పారు. తన కవితా వస్తువు గురించి చెబుతూ నా కవితలు సామాజిక న్యాయం కోసం జాగృతినొందించే మాతృకలు. పరాజయానికి తావేలేదు. అక్షర సైన్యానికి ఓటమి భయం లేదు, గెలవాలన్న కోరిక తప్ప. కాన్పూర్‌లోని విక్టోరియా కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఆయన దేశభక్తి గీతాలు రాసి, శ్రావ్యంగా ఆలపించి శ్రోతల్లో జాతీయ భావనలను రగుల్కొల్పారు.
వాజపేయి కవితల్లో ‘‘శ్రమయేవ జయతే’’ సందేశం వినిపిస్తుంది. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కవి నమ్మకం. ఎండుటాకులు రాలిన చోట కొత్త చివురు చిగురిస్తుందన్న సత్యాన్ని అందించే యీ కవితల్లో తూర్పు దిక్కున పొడిచిన తొలిపొద్దు కిరణం, ఆశకు సంకేతంగా నిలుస్తుందని కవి భావించారు. తన జీవితంలో ఓటమికి తావులేదని, ఆశల సౌధంపై విజయకేతనం ఎగురువేస్తానంటూ ఆయన వ్రాశారు.
వాజపేయితో రచయితగా సాహచర్యం సన్నిహితత్వం నా అదృష్టం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి గారితో కలిసి పార్లమెంటు లాబీలలో, వరండాలో ప్రధానమంత్రి నివాసంలోని ‘‘పంచవటి’’ సమావేశ మందిరంలో కలవటం, సి.నా.రె. తన గజల్స్‌ వినిపిస్తుంటే వాజపేయి ఆనందించటం, నేను వాజపేయి గారి కవితలు ఆయనకు వినిపిస్తుంటే ఆయన చిరునవ్వుతో ఆస్వాదించటం నా పురాకృత పుణ్యంగా, నా జీవితం ధన్యంగా నేను భావిస్తాను.
courtesy.... ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

No comments:

Post a Comment

కవిగా కూడా రాణించిన వాజపేయి !!

గొప్ప తాత్వికునిగా, సౌందర్యోపాసకునిగా, సంస్కృతీ సాంప్రదాయాలను అమితంగా ప్రేమించే వ్యక్తిగా, మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజెప్పే ప్రబోధకునిగ...